పాదయాత్రలు చేస్తే తెలంగాణ ప్రజలు దంచి కొడతారు : హరీశ్ రావు

మట్టి పనుల్లో రూ.25 వేల కోట్లు కోత పెట్టిన కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిలదీయాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణకు ఈజీఎస్ కింద కూలీలకు 3 వేల కోట్ల పనిదినాలను తగ్గించడంపై కేంద్రాన్ని ప్రశ్నించాలని అన్నారు. కూలీలపై ప్రేమ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినట్టు రాష్ట్రంలో పనిదినాలను 13 వేల కోట్ల నుంచి 16 వేల కోట్లకు పెంచేలా చూడాలని అన్నారు. నంగునూరు మండలం నర్మేట గ్రామంలో ఈజీఎస్, సీఎస్ఆర్ నిధులు 2 కోట్ల రూపాయలతో నిర్మించిన పాడి పశువుల హాస్టల్, పాల సేకరణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
అన్ని వర్గాల ప్రజల నోట్లో మట్టి కొట్టి… సిగ్గు లేకుండా పాద యాత్రలు చేస్తారా అని బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని హరీశ్ రావు నిలదీశారు. ‘ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లు పెంచకుండా తొక్కి పెట్టినందుకా? వడ్ల కొననందుకా? పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి నందుకా, వంట గ్యాస్ ధర మంట పెట్టినందుకా, నిరుద్యోగులకు జాబ్లు ఇవ్వనందుకా, ఎరువుల ధరలు విపరీతంగా పెంచినందుకా… ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో.. ముందు స్పష్టత ఇచ్చాకే పాదయాత్ర చేపట్టాలి’ అని హరీశ్ రావు అన్నారు.
అలా కాకుండా పాదయాత్రలు చేస్తే తెలంగాణ ప్రజలు దంచి కొడతారని హెచ్చరించారు. ప్రజల ఆకాంక్షల నుంచి, వారి ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతామని అన్నారు. పెంచేటోడు బీజేపీ వాడైతే… పంచేవారు టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. ఎవ్వరూ కావాలో… ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. ఈ అంశాలపై గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలు విస్తృతంగా చర్చించాలని సూచించారు. సమైక్య రాష్ట్రంలో ఏకాలం చూసిన ఎండా కాలమే అని…. స్వరాష్ట్రంలో ఏకాలం చూసిన వానాకాలం లాగే ఉందని చెప్పారు.